HomeTelanganaThe Telangana Government Is Planning Ahead To Provide Irrigation Water To Every Corner Of The Country
Telangana | ప్రతి ఎకరానికి సాగునీటి వసతి కల్పించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ప్రభుత్వం
ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టడమేకాదు.. మూలమూలకూ సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. ఒకవైపు భారీ ప్రాజెక్టులతోపాటు చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణాలను కొనసాగిస్తూనే మరోవైపు చిన్నలిఫ్ట్ల ఏర్పాటుపైనా దృష్టిసారించింది.
తొలిదశలో 175 లిఫ్ట్ల పునరుద్ధరణకు చర్యలు
22.96 కోట్లతో మరమ్మతులు చేపట్టిన ప్రభుత్వం
‘ ఏర్పాటుతో బలోపేతం
గ్యాప్ ఆయకట్టుకోసం కొత్త లిఫ్ట్లకు ప్రతిపాదనలు
సమైక్య పాలనలో 225 ఐడీసీ లిఫ్ట్లు నిరుపయోగం
వినియోగంలోకి తెచ్చేలా కేసీఆర్ సర్కారు ప్రణాళిక
Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టడమేకాదు.. మూలమూలకూ సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. ఒకవైపు భారీ ప్రాజెక్టులతోపాటు చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణాలను కొనసాగిస్తూనే మరోవైపు చిన్నలిఫ్ట్ల ఏర్పాటుపైనా దృష్టిసారించింది. ఉమ్మడిపాలనలో నిర్వహణ లేక నిరుపయోగంగా మారిన లిఫ్ట్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడంతోపాటు ప్రాజెక్టులు, చెరువులు, కాలువల కింద కవర్కాని ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు అదనంగా మరికొన్ని చిన్నలిఫ్ట్లను ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టింది. ప్రతి ఎకరానికి సాగునీటి వసతి కల్పించడమే లక్ష్యంగా సమగ్ర ప్రణాళికతో ముందుకుసాగుతున్నది.
175 లిఫ్ట్ల పునరుద్ధరణకు మహర్దశ
తెలంగాణ పీఠభూమి ఎత్తుపల్లాలుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు ప్రాజెక్టులు, కాలువల కింద సాగునీరందని ఎత్తయిన ప్రాంతాలనూ తడిపేందుకు చిన్న లిఫ్ట్లను ఏర్పాటు చేస్తూ వస్తున్నది. కాలువలు, సమీప చెరువుల నుంచి నీటిని మెట్టప్రాంతాలకు ఎత్తిపోస్తారు. ఈ చిన్నతరహా లిఫ్ట్ల కింద 500 నుంచి 5 వేల ఎకరాలకు మించి ఉండదు. ఇలాంటి లిఫ్ట్ల ఏర్పాటు కోసం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ప్రత్యేకంగా నెలకొల్పింది. అయినప్పటికీ ఈ లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించింది. కరెంటు చార్జీలను కూడా సదరు ఆయకట్టు రైతులపైనే మోపింది. అప్పటికీ కరెంటునైనా సక్రమంగా సరఫరా చేసిందా? అంటే అదీ లేదు. లోవోల్టేజీ కరెంటు మూలంగా తర చూ మోటర్లు కాలిపోవడంతో లిఫ్ట్లు ఏర్పాటు చేసినా పనిచేయని దుస్థితి నెలన్నది.
రాష్ట్ర విభజన నాటికి మొత్తంగా 578 లిఫ్ట్ స్కీమ్లు ఉండగా.. అందులో 40 లిఫ్ట్లు పూర్తిగా నిరుపయోగంగా మారాయి. 538 స్కీములు ఉండగా అందులోనూ 225 ఎత్తిపోతల పథకాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పైప్లైన్లు దెబ్బతినడం, మోటర్లు కాలిపోవడం తదితర కారణాలతో మూలకుపడ్డాయి. ఇక ప్రస్తుతం మిగిలిన ఆ 538 ఎత్తిపోతల స్కీముల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4.69 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఆ స్కీములన్నింటికీ మరమ్మతులు చేసి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం 225 లిఫ్ట్ స్కీముల్లో ప్రస్తుతం 175 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. మొత్తంగా రూ.22.96 కోట్లతో ఇరిగేషన్ అధికారులు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆయా లిఫ్ట్ల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
కొత్తగూడెం టెరిటోరియల్లోనే 82 స్కీములు
ప్రభుత్వం పునరుద్ధరణకు చేపట్టిన లిఫ్ట్లలో అత్యధికంగా కొత్తగూడెం చీఫ్ ఇంజినీర్ టెరిటోరియల్ పరిధిలోనే ఉన్నాయి. 175 స్కీముల్లో 82 ఇక్కడే ఉండటం విశేషం. ఈ లిఫ్ట్లను మరమ్మతు చేయడం ద్వారా దాదాపు మిట్టప్రాంతాల్లోని 1.50 లక్షల ఎకరాలకుపైగా సాగు నీరందనున్నది.
పకడ్బందీగా నిర్వహణ..
ప్రభుత్వం చిన్న లిఫ్ట్ల నిర్వహణపైనా ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఎత్తిపోతల స్కీములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పకడ్బందీ వ్యవస్థ అత్యంత అవసరం. ఇందుకు సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఇరిగేషన్శాఖలో ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ఎం) విభాగం కీలకభూమిక పోషిస్తున్నది. టెరిటోరియల్ కేంద్రంగా ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఓఅండ్ఎం పర్యవేక్షిస్తున్నది. చిన్నచిన్న మరమ్మతులు, అత్యవసర పనులకు ఈఎన్సీల అనుమతి లేకుండానే ఈఈ, డీఈల స్థాయిలోనే పనుల నిర్వహణకు నిధులను కేటాయించారు. అదీగాక నీటి విడుదల, ఆయకట్టుకు అందుతుందా? లేదా? అనే కాకుండా తూములు, గేట్లు, పంప్హౌస్ల మెయింటనెన్స్ కోసం ప్రభుత్వం ఇటీవలే లష్కర్లు, హెల్పర్ల నియామకానికి కూడా చర్యలు చేపట్టడం విశేషం.
గ్యాప్ ఆయకట్టు కోసం కొత్త లిఫ్ట్లు
రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నా కూడా ఎత్తుమీద ఉండి సాగునీరందని గ్యాప్ ఆయకట్టు కోసం ప్రభుత్వం మరిన్ని చిన్న లిఫ్ట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు రూ. 743.19 కోట్లతో 37 స్కీములను చేపట్టింది. ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తయితే మరో 65 వేల ఎకరాలకు సాగునీరందనున్నది. అవిగాకుండా మరిన్ని ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ గ్యాప్ ఆయకట్టులో దళితులు, గిరిజనుల ఆయకట్టుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని యోచిస్తున్నారు. మరోవైపు గ్యాప్ ఆయకట్టుకు సైతం సాగునీరందించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు 35 ఎత్తిపోతల స్కీములను ఐడీసీ ఎదుట ఇప్పటికే ప్రతిపాదించారు. ఆయా ప్రతిపాదనలను త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు.
ముమ్మరంగా పనులు
రాష్ట్రవ్యాప్తంగా పాక్షికంగా దెబ్బతిన్న 175 చిన్నతరహా నీటిఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులను రూ.22.96 కోట్లతో చేపట్టాం. ఇందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓఅండ్ఎం విభాగం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నది. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తిచేస్తాం. చిన్న నీటిఎత్తిపోతల పథకాల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి సారించాం.
– నాగేంద్రరావు, ఈఎన్సీ (ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్)