వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 28 : సంపన్నులకే సాకారమయ్యే కార్పొరేట్ వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. లక్షల రూపాయల వ్యయంతో కూడిన భారీ శస్త్రచికిత్సలను ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నది. ప్రభుత్వ దవాఖానలకు అన్ని రకాల వైద్య పరికరాలు సహా పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించడంతో కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలందిస్తున్నాయి. ఈ వైద్యసేవలను కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా ఇతర నగరాలకు కూడా విస్తరించేలా సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా మారుస్తామని ఇచ్చిన మాట బుధవారం సంపూర్ణంగా నెరవేరింది.
గుండెకు రంధ్రంతో సంవత్సర కాలంగా ఇబ్బంది పడుతున్న ఓ మహిళకు వరంగల్లో ప్రభుత్వ వైద్యులు ఓపెన్హార్ట్ సర్జరీ విధానంలో కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ఇప్పటివరకూ ఇటువంటి ఆపరేషన్లు హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ దవాఖానల్లోనే జరుగుతుండగా మొదటిసారిగా వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనికి చెందిన వడ్డేపల్లి స్వప్న (31) ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెలో చిన్న రంధ్రం ఉన్నట్టు తేలింది. ఆమెకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 20 రోజులపాటు పరీక్షలు చేసిన డాక్టర్లు బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు.
రెండున్నర గంటలు శ్రమించిన వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్రావు పర్యవేక్షణలో కార్డియోథొరాసిక్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లాడి సృజన్, డాక్టర్ రితీశ్, పర్ఫ్యూషనిస్ట్ శ్రీనివాస్, అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జునరెడ్డి, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రవణ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ స్ఫూర్తి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ మురళి, నర్సింగ్ సూపరింటెండెంట్ సుశీల బృందం, పలువురు టెక్నికల్ సిబ్బంది, తదితరులు ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో కేవలం చిన్న చిన్న ఆపరేషన్లే చేస్తున్నారన్న విమర్శలకు ఈ శస్త్రచికిత్సతో తెరపడింది. మొదటి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ వెలుపల మొదటిసారి ఓ ప్రభుత్వ దవాఖానలో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించిన వైద్యుల బృందానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకున్న చర్యల ఫలితమే వరంగల్ దవాఖానలో మొదటిసారిగా జరిగిన ఈ శస్త్రచికిత్స అని పేర్కొన్నారు.