హైదరాబాద్, మే25 (నమస్తే తెలంగాణ): గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్)లను అనుసంధానిస్తూ ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ఆవులపల్లి రిజర్వాయర్ పనులను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పనులు చేపట్టకుండా ఏపీని నిలువరించాలని కోరుతూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖ రాశారు.
కృష్ణా జలాల ఆధారంగా చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఆవులపల్లి వద్ద ఏపీ ప్రభుత్వం కొత్తగా రిజర్వాయర్ను నిర్మిస్తున్నదని లేఖలో మురళీధర్ పేర్కొన్నారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకోకుండానే పనులు చేపట్టిందని ఆరోపించారు.
పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక రూ.100 కోట్ల జరిమానా విధించిందని, ఆ మొత్తాన్ని కేఆర్ఎంబీకి 3 నెలల్లోగా చెల్లించాలని ఆదేశించిందని గుర్తు చేశారు.
ఆవులపల్లి, ముడివేడు, నేతిగుంటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను కూడా నిలిపేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. వాటిని బేఖాతరు చేస్తూ రిజర్వాయర్ పనులు చేపట్టిన ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్జీటీ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల కాపీ, పనులు కొనసాగిస్తున్న తీరుపై పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలను లేఖతో జతచేసి అందించారు.