హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. మంగళవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ ఆయా సీట్ల వివరాలను వెల్లడించారు. మొత్తం 137 ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 56,064 సీట్లు కాగా, 16 ప్రభుత్వ వర్సిటీల్లో 4,713 సీట్లు, రెండు ప్రైవేట్ వర్సిటీల్లో 1,032 సీట్లు ఉన్నట్టు వివరించారు. కోర్సుల వారీగా తీసుకొంటే సీఎస్ఈ కోర్సులో అత్యధికంగా 15,897 సీట్లు, ఈసీఈలో 9,734 సీట్లు ఉన్నట్టు తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో యాజమాన్య, కన్వీనర్ కోటా కింద కలిపి మొత్తం 80,091 సీట్లను భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, వెబ్ ఆప్షన్ల నమోదు బుధవారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలోనే సీట్లను ఖరారు చేశారు. మంగళవారం వరకు 54,029 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. జూలై 7 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 8 వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉన్నది.
గతంతో పోల్చితే ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య తగ్గినట్టుగా కనిపిస్తున్నా.. త్వరలోనే మరికొన్ని సీట్లకు అనుమతులు వచ్చే అవకాశాలున్నా యి. నిరుడు 177 కాలేజీల్లో 78,336 సీట్లుండగా, ప్రస్తుతానికి 155 కాలేజీల్లో 62,079 సీట్లకు అనుమతులు లభించాయి. అయితే పలు కాలేజీలు కోర్సుల మార్పిడికి దరఖాస్తు చేసుకొన్నాయి. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ కోర్సుల్లో సీట్లను తగ్గించుకొని సీఎస్ఈ కోర్సులో సీట్లను పెంచుకొనేందుకు దరఖాస్తులు అందజేశాయి. ఇందుకు సంబంధించిన ఫైళ్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇందుకు ఆమోదం లభిస్తే, మరో 15 వేల సీట్ల వరకు అనుమతులు రానున్నాయి. తర్వాత ఈ సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్లో చేరుస్తామని ఎంసెట్ అధికారులు వెల్లడించారు.