తెలంగాణ ఆడపిల్లల కండ్లల్ల నీళ్లు రావు, నిప్పులే వస్తయ్.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే వెళ్తాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మనం ఉద్యమంలో ఉన్నం. ప్రజాబలం, ప్రజాశక్తి ఏందో, వారి ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్లం. ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రేమతో వివరించి వారిని శక్తిమంతులుగా మారుస్తం. అంతదాక రెస్ట్, రిలాక్స్ లేదు. విశ్రమించే ప్రసక్తే లేదు.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సాహిత్య, సాంస్కృతిక, భాషా రంగాల్లో వివక్షపై తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసినట్టే.. దేశంలో అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉన్న దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఆడబిడ్డల కండ్లనుంచి నీళ్లు రావని.. నిప్పులే వస్తాయని తేల్చిచెప్పారు. సీబీఐ, ఈడీ దాడులు తమనేమీ చేయలేవని ధీమా వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతున్న తరుణంలో దేశాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ జాగృతిదేనని స్పష్టంచేశారు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధంకావాలని, అంతవరకు విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సోమవారం హైదరాబాద్లో తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై కవిత నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో కవిత ప్రసంగించారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరును ఎండగట్టారు. నిరాశ, నిస్పృహతో మేధావులు మాట్లాడటమే బంద్ చేశారని.. కవులు, రచయితలు గళమెత్తడమే మానేశారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏం రాస్తే.. ఎవరు దాడి చేస్తారోనన్న ఆందోళనతో సాహిత్యకారులు ప్రస్తుతం రాయటం లేదని, అదే సమయంలో పురస్కారాలను ప్రభుత్వం ముఖాన కొట్టిన నిరసన గళాన్ని వినిపించిన రచయితలూ ఉన్నారని పేర్కొన్నారు.
నాపై జరిగే దాడి నా ఒక్కరిదే కాదు. ఇలాంటివి ఇంకా చాలామందిపై జరుగుతాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రశ్నించే గొంతుకలపై దాడులు జరుగుతున్నయ్. బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎవరు ప్రశ్నిస్తే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు సాధారణమైపోయాయి. ఆ దాడులకు మేం బెదిరేది లేదు.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ప్రతీ రాష్ర్టానికి వెళ్లి దేశంలో జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ జాగృతి సైన్యం ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తే, ప్రజాస్వామ్యం గొంతు నొక్కడాన్ని నిరసిస్తూ ఒక పత్రిక ధైర్యంగా మొదటి పేజీని ఖాళీగా వదిలేసిందని ఉదహరించారు. నేడు 8 రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేస్తుంటే పెద్ద పెద్ద పత్రికలు తమ పాత్ర పోషించటంలేదని, ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదా? దీన్ని ప్రశ్నించొద్దా? ఈ పరిస్థితుల్లో జాతిని మనం జాగృతం చేయొద్దా? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయిన సందర్భంగా కొన్ని పత్రికలు ప్రచురించిన కథనాలను వేదికపై కవిత చదివి వినిపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ కూల్చివేస్తున్నదని, ఫోర్త్ ఎస్టేట్గా అభివర్ణించే మీడియా ప్రైవేట్ ఎస్టేట్గా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ వైఫల్యాలను ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడి చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మీడియాలో లీకులు ఇచ్చి, వ్యక్తుల వ్యక్తిత్వాలను హననం చేయటం, ప్రతిపక్షాలపై దాడులకు ఉసిగొల్పడం లాంటివి అదేపనిగా కొనసాగితే అంతిమంగా ప్రజలకే తీవ్రనష్టం వాటిల్లుతుందన్నారు. దేశంలో జరుగుతున్న అన్ని విషయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తెలంగాణ జాగృతిపై ఉందన్నారు. ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించాలంటే భావజాల వ్యాప్తే అసలైన సాధనమని ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేర్కొన్న అంశాన్ని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రవచించిన ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ ఆధారంగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని కవిత అన్నారు. దేశంలో దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు బంద్ చేస్తే ఒక్క నిరసన కార్యక్రమం జరగలేదని, అదే సమయంలో బాసర ట్రిపుల్ఐటీ బాసర విద్యార్థులు లొల్లి చేస్తే విద్యాశాఖమంత్రి వెళ్లి వారితో చర్చించారని వివరించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదని, దేశంలో లేదనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పారు. ప్రపంచంలో అనేక సూచీల్లో భారత్ ఘోరంగా వెనుకబడిపోయిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువల స్థాపనలో, రూపాయి విలువ పతనంలో, నిరుద్యోగిత రేటు విషయంలో, ఆకలి సూచి.. ఇలా అన్నింటా దేశం ప్రతిష్ఠ దిగజారిందని ఆందోళన వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలను ఏకం చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. బీజేపీ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రబలమైన శక్తిగా ముందుకు సాగాలని కోరారు. దేశంలో అనేక సంస్థలు జాగృతితో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ జాగృతి ప్రబలమైన శక్తిగా ఉందని, 33 జిల్లాల్లో 12వేల గ్రామాల్లో ప్రతీ చోటా కార్యకర్తలున్నారని, అదే విధంగా 18 దేశాల్లో కమిటీలు పనిచేస్తున్నాయని వివరించారు. బీజేపీ అనుసరిస్తున్న సాంస్కృతిక, సాహిత్య, కళా విధ్వంసక విధానాలపై ప్రజాచైతన్య పోరాటానికి సంపూర్ణ కార్యాచరణను రూపొందించుకునేందుకు త్వరలో జాగృతి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
తనపై జరిగే దాడి తన ఒక్కరిదే కాదని, ఇలాంటివి ఇంకా జరిగే అవకాశాలున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రశ్నించే గొంతుకలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులకు తాము బెదిరేది లేదని తేల్చిచెప్పారు. దాడుల పేరుతో దర్యాప్తు సంస్థలు వృథా చేసే సమయానికి మూడింతలు ఎక్కువగా పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు.‘తెలంగాణ ఆడపిల్లల కండ్లల్ల నీళ్లు రావు, నిప్పులే వస్తయ్.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే వెళ్తాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని కవిత తేల్చిచెప్పారు. ‘మనం ఉద్యమంలో ఉన్నం. ప్రజాబలం, ప్రజాశక్తి ఏందో, వారి ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్లం. ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రేమతో వివరించి వారిని శక్తిమంతులుగా మారుస్తం. రెస్ట్, రిలాక్స్ లేదు. విశ్రమించే ప్రసక్తే లేదు’ అని స్పష్టంచేశారు.
తెలంగాణ భాషపై, పండుగలపై వివక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జాగృతి విజయవం తమైందని కవిత చెప్పారు. సమైక్యపాలనలో బతుకమ్మను ఎత్తుకోవాలంటే ఆడపిల్లలు సిగ్గుపడే పరిస్థితులు ఉండేవని,ఇవ్వాళ సగర్వంగా, సంబురంగా బతుకమ్మ ఆడుతున్నారని చెప్పారు. మానవవనరుల అభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, చరిత్రను అధ్యయనానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని, రైతుల కోసం, గల్ఫ్ బాధితుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కార్య క్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దేవీ ప్రసాద్, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, టీఎస్ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ఆచారి, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, విజయ్భాస్కర్, కోదాటి శ్రీను, రాష్ట్ర, జిల్లా కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై బీజేపీ సర్కారు ఆరోపణలకు దిగుతున్నదని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ సర్కారు కేసుతో సంబంధం లేకున్నా దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పుతున్నారని సోమవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. సీబీఐ వివరణ కోరితే ఎమ్మెల్సీ కవిత ధైర్యంగా సహకరించారని, ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్పై ప్రకటన చేయగానే పార్టీ నేతలపై ఐటీ, సీబీఐ రైడ్స్ జరుగుతున్నాయని, కేసీఆర్ కుటుంబ ప్రతిష్ట దిగజార్చడానికి బీజేపీ నీతిబాహ్యమైన చర్యలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు.
తెలంగాణ జాగృతి జాతీయస్థాయికి విస్తరించాలని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆకాంక్షించారు. దేశంలోని వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలపై భావజాల వ్యాప్తికి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ద్వారా రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తే, కవిత సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపారని కొనియాడారు.
ఎదిరించేవాడు లేనంతవరకు బెదిరించేవాడిదే రాజ్యం అన్నట్టుగా ఇన్నాళ్లూ సాగిందని.. ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ చెప్పారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలను ఎదురించేవాడు కేసీఆర్ రూపంలో ఉద్భవించారని అన్నారు. సకల వ్యవస్థలను నిర్వీర్యం చేయటమే బీజేపీ ప్రభుత్వ విధానంగా కొనసాగుతుందని ఆయన నిప్పులు చెరిగారు. సమానత్వం అనే సిద్ధాంతానికి బీజేపీ వ్యతిరేకమని, సామాజిక న్యాయం అంటే గిట్టని దుర్మార్గ విధానాలను మోదీ అనుసరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశంలో ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు బీజేపీకి కండువాల్లేని అనుబంధ విభాగాలుగా పనిచేస్తున్నాయని తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ఆచారి విమర్శించారు. ప్రజలపై భారం మోపుతున్న కేంద్రం.. అదానీ, అంబానీలాంటి బడా పెట్టుబడిదారులకు దేశసంపదను దోచిపెడుతున్నదన్నా రు. దేశప్రజలను జాగృతం చేసే కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
దేశానికి అసలైన నాయకుడు సీఎం కేసీఆరేనని టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రూపంలో తమను ప్రశ్నించే నాయకుడిగా కేసీఆర్ వస్తున్నారనే భయంతో బీజేపీ.. రాష్ట్రంపై, నాయకులపై కుట్రలకు పాల్పడుతున్నదని, ప్రజాక్షేత్రంలో వాటిని ఎండగడతామని చెప్పారు. కవిత నాయకత్వంలో దేశం జాగృతం అవుతుందని అశాభావం వ్యక్తంచేశారు.