హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన నదుల అనుసంధానం ప్రాజెక్టు టాస్ఫోర్స్ కమిటీ 19వ సమావేశంలో ఇచ్చంపల్లి బరాజ్ ఎత్తు పెంపు అంశంపై చర్చ కొనసాగింది. మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి బరాజ్ ఎత్తును పెంచి, అక్కడి నుంచే మేడిగడ్డ అవసరాలను తీర్చుకోవచ్చనే సరికొత్త ప్రతిపాదనను ఎన్డబ్ల్యూడీఏ తెరమీదకు తీసుకొచ్చింది. ఈ అంశంపై టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఎత్తు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఎన్డబ్ల్యూడీఏకు కమిటీ సూచించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే గోదావరి, కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి వాటాకు, సమ్మక-సారక ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొన్నట్టు సమాచారం. నదుల అనుసంధానం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని, దాదాపు 47 టీఎంసీల గోదావరి జలాలను వాడుకునే అవకాశం దక్కుతుందని టాస్క్ఫోర్స్ కమిటీ అభిప్రాయం వ్యక్తంచేసినట్టు వినికిడి.
గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్ ఆమోదానికి రాష్ట్రాలకు విధించిన గడువును ఎన్డబ్ల్యూడీఏ ఎత్తేసింది. ప్రాజెక్టు డీపీఆర్పై అభ్యంతరాలు, సూచనలను నెలాఖరులోగా తెలపాలని, లేదంటే ఆమోదించినట్టుగానే పరిగణనలోకి తీసుకుంటామని రాష్ర్టాలకు ఇటీవల ఎన్డబ్ల్యూడీఏ ఆల్టిమేటం జారీ చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ డెడ్లైన్ను ఎత్తేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రభుత్వాలు ఏవిధమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేని సమయంలో ఇలాంటి షరతులు పెట్టడమేమిటని పలు రాష్ర్టాలు ఎన్డబ్ల్యూడీఏ తీరును తీవ్రంగా ఆక్షేపించాయి. దీంతో ఎన్డబ్ల్యూడీఏ నిర్దేశిత గడువును ఎత్తేసింది. ఈ మేరకు రాష్ర్టాలకు సమాచారం అందించినట్టు తెలిసింది.