Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మనీ లాండరింగ్ కేసుల్లో విచారణకు సంబంధించి ఈడీ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టింది. నిందితులకు డిఫాల్ట్ బెయిల్ (స్టాట్యూటరీ బెయిల్) నిరాకరించేందుకు ఈడీ అధికారులు వరుసగా అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేయడాన్ని ప్రశ్నించింది. కోర్టులో విచారణ జరుగకుండానే నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచడమేంటని నిలదీసింది.
ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు కనుసన్నల్లో ఈడీ పనిచేస్తున్నదంటూ ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్న సమయంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సన్నిహితుడు ప్రేమ్ప్రకాశ్ను 2022 ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
మనీలాండరింగ్, ఆయుధ చట్టాల కింద పలు కేసులు నమోదు చేశారు. దీంతో గడిచిన 18 నెలలుగా ప్రకాశ్ జైల్లోనే ఉన్నారు. నిందితుడు కింది కోర్టులో డీఫాల్ట్ బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ, అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేస్తూ ఈడీ అధికారులు విచారణను పొడిగిస్తున్నారు. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఏమిటీ డీఫాల్ట్ బెయిల్?
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం.. నిర్దేశించిన గడవులోగా అధికారులు దర్యాప్తు పూర్తి చేయకపోయినా, లేదా తుది చార్జిషీటు దాఖలు చేయకపోయినా.. అప్పటికే అరెస్టయిన వ్యక్తి డీఫాల్ట్ బెయిల్ పొందేందుకు అర్హుడిగా పేర్కొంటారు. దర్యాప్తు గడువును సాధారణంగా 60 లేదా 90 రోజులుగా నిర్ణయిస్తారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ తమకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కూడా డీఫాల్ట్ బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు