హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కోట్ల రూపాయల విలువ చేసే మంచిరేవుల భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో 142 ఎకరాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చేసిన వాదనలకు ప్రతిఫలం దక్కింది. మంచిరేవులలోని భూములను పోలీసు గ్రేహౌండ్స్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్తో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ వివాదంలో ఇకపై కింది కోర్టులు, హైకోర్టులు కూడా కలగజేసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది.
మంచిరేవుల భూముల వివాదం ఇదీ..
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామ రెవన్యూ సర్వే నంబర్ 391/1, 391/20లో గల 142 ఎకరాల 39 గుంటల భూమిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1961లో గ్రేహౌండ్స్కు కేటాయించింది. అయితే ఆ భూములను ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టును ఆశ్రయించగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఆ భూములు గ్రేహౌండ్స్కే చెందుతాయని సుప్రీంకోర్టు 2007లో తీర్పునివ్వగా, గ్రేహౌండ్స్ స్వాధీనం చేసుకుంది. కాగా హైకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉందంటూ అసైనీలు 2009లో మళ్లీ పిటిషన్ వేయగా, 2010లో హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. సంబంధిత భూమి ప్రభుత్వానిదని, గ్రేహౌండ్స్కు కేటాయించామని తెలుపగా హైకోర్టు స్టేటస్కో విధించింది. మరోవైపు కోర్టులో న్యాయ వివాదం కొనసాగుతుండగానే అసైనీల వారసులలో ఇద్దరు ఎకరాకు రూ.4 కోట్ల చొప్పున అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి బయానాగా రూ.8 లక్షల చొప్పున ఇచ్చి జీపీఏ చేయించుకున్నారు. ఈ కబ్జా వ్యవహరంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ సంబంధిత కబ్జాదారులపై కేసులు నమోదు చేసి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైకోర్టు 2021లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి ప్రభుత్వ వాదనే చెల్లింది.
భూముల పరిరక్షణలో ఆలుపెరగని పోరు…
ప్రభుత్వానికి చెందిన మంచిరేవుల భూములు కబ్జాదారుల పరం కాకుండా ఉండేందుకు రెవెన్యూ యంత్రాంగం 1994 నుంచి పట్టుదలతో పనిచేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని పక్కా ప్రణాళికలతో కొనుగోలు, అగ్రిమెంట్ల కథ నడిపించారు. వీటన్నింటినీ సమగ్రంగా విచారణ చేసిన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో వివరాలను సేకరించి న్యాయస్థానం ముందు ఉంచింది. దీంతో రూ.10 వేల కోట్లకు పైగా విలువ చేసే భూములు చివరకు ప్రభుత్వానికే దక్కాయి.