హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరధేను నియమించాలని కేంద్రా నికి సిఫారసు చేసింది. జస్టిస్ అలోక్ అరధే మధ్యప్రదేశ్కు చెందినవారు. 2009 డిసెంబర్లో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఇప్పుడు పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు సీజే కాబోతున్నారు. గత ఏడాది జూన్ 28న సీజేగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశాక హైకోర్టుకు కొత్త సీజే రానున్నారు. జస్టిస్ అలోక్ అరధే రాయ్పూర్లో 1964 ఏప్రిల్ 14న జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ చేశాక 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అ య్యారు.
2007లో సీనియర్ న్యాయవాది అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంలో పేరు గడించారు. 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితలయ్యారు. 2016 సెప్టెంబర్ 16న జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అదే హైకోర్టులో తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2018 నవంబర్ 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇకడ కూడా తాతాలిక సీజేగా సేవలందించారు. ఇప్పుడు పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు సీజేగా రాబోతున్నారు. కొలీజియం సిఫారసులకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తర్వాత సీజేగా జస్టిస్ అలోక్ అరధేతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు.
నాలుగేండ్లలో ఆరో సీజే
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన 2019 జనవరి 1వ తేదీన జరిగింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు సీజేలు మారారు. నాలుగేండ్లలో సీజేలుగా జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పనిచేశారు. జస్టిస్ అలోక్ అరధే ఆరో సీజే కానున్నారు.
ఏపీకి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత ఏపీ సీజే జస్టిస్ పీకే మిశ్రా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. కొత్త సీజేగా జస్టిస్ ఠాకూర్ పేరును ప్రతిపాదించింది. జమ్ముకశ్మీర్కు చెందిన ఆయన 2013లో జడ్జిగా నియమితులయ్యారు. ఆయనను 2022లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమించారు.
ఏడు హైకోర్టులకు సీజేల సిఫారసు
దేశంలోని ఏడు హైకోర్టులకు కొత్త సీజేలను ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి బుధవారం ప్రతిపాదనలు పంపింది. బాంబే, గుజరాత్, తెలంగాణ, కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ హైకోర్టులకు కొత్త సీజేలను ప్రతిపాదించింది.