Tirumala | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. విశేష సం ఖ్యలో వస్తున్న భక్తులు దివ్య దర్శన టోకెన్ల కోసం పడిగాపులుకాస్తున్నారు. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని అపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని అన్ని షెడ్లు భక్తులతో నిండి క్యూలైన్ ఏటీజీహెచ్ అతిథి గృహం వరకు వ్యాపించి ఉంది.
మరో రెండు వారాలు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం క్యూలైన్లో భక్తులకు దాదాపు 30 గం టల సమయం పడుతున్నది. క్యూలైన్లో వేచియున్న భక్తులకు టీటీడీ అన్నప్రసా దం, పాలు, మజ్జిగ అందిస్తున్నది. శ్రీవారి మెట్లమార్గంలో రోజుకు ఇచ్చే 5 వేల టో కెన్స్ అయిపోవడంతో భక్తులకు నిరీక్షణ తప్పలేదు.
టైమ్స్లాట్, కాలినడక వచ్చే దివ్యదర్శనం భక్తులకు సుమారు 7 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు సుమారు 5 గంటల సమయం పడుతున్నది. శనివారం తిరుమల శ్రీవారిని 82,139 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,849 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, రూ.3.97 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.