డిచ్పల్లి, మే 30: తెలంగాణ విశ్వవిద్యాలయం పరువును మంటగలిపి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వైస్చాన్సలర్ రవీందర్గుప్తాను ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేసి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, బీవీఎం విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం వీసీ చాంబర్ను ముట్టడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బులను వీసీ విచ్ఛలవిడిగా ఖర్చు చేసి ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు పక్కదోవ పట్టించడానికే వీసీ పలు నిర్ణయాలు తీసుకుంటూ వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
టీయూకు రిజిస్ట్రార్ ఎవరో తెలియక విద్యార్థులు, అందులో పనిచేసే సిబ్బంది అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. వీసీ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని వీసీ చాంబర్లోని టేబుల్పైకి ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం వీసీ బయటకు వెళ్లే సమయంలో ఆయన వాహనానికి ఎదురుగా కూర్చుని నిరసన తెలిపారు. దీంతో వీసీ పోలీసు వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.