హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పన్నిన వ్యూహాలు ఫలించాయి. క్షేత్రస్థాయిలో మొదటినుంచీ మంత్రి జగదీశ్రెడ్డి చేసిన కృషి అందుకు తోడయ్యింది. కేటీఆర్, హరీశ్రావు.. కృష్ణార్జునులై సారథ్యం వహించి, క్యాడర్ను, ప్రచార బాధ్యతల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు, మునుగోడు ఉప ఎన్నికకు ఉన్న తేడాను వివరించడం ద్వారా తొలి విజయం సాధించారు. ఉద్యమ సమయంలో 2003లో కేసీఆర్ వెంట పాదయాత్రలో పాల్గొనడం, మర్రిగూడలో నిద్రచేయడం వంటి అనుభవాలు హరీశ్రావుకు ఉన్నాయి. 2011లో నాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ సారథ్యంలోని ప్రజాప్రతినిధుల బృందంతో ఖుదాబక్ష్పల్లి పర్యటించిన అనుభవం కేటీఆర్కు ఉన్నది. శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామిని అక్కున చేర్చుకొని ఆదుకోవడం తదితర రూపాల్లో మునుగోడుతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఆ బంధమే మునుగోడులో టీఆర్ఎస్ను విజయతీరంలో నిలబెట్టేందుకు తోడ్పడింది.
కేటీఆర్, హరీశ్రావు రోడ్షోలతో నియోజకవర్గాన్ని చుట్టేశారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేసినరోజు చండూరులో నిర్వహించిన రోడ్షోలో ‘మునుగోడును దత్తత తీసుకుంటా’ అని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనతో మునుగోడు ప్రజల సంకల్పం దృఢంగా మారింది. ఆ తరువాత ప్రచారం చివరి రోజున చండూరు అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయిస్తామని హరీశ్రావు హామీ ఇవ్వడాన్ని మునుగోడు ఆలకించింది. వివిధ కుల సంఘాల వారితో సమావేశాలు నిర్వహించి, ఆయా కులాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంలో కేటీఆర్, హరీశ్రావు అనుసరించిన వ్యూహం ఫలప్రదమైంది.
రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో మంత్రి జీ జగదీశ్రెడ్డి వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో టీఆర్ఎస్ క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేయడం, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఆహ్వానించడం, బీజేపీని నిలువరించడం వంటి వ్యూహాలను క్షేత్రస్థాయిలో జగదీశ్రెడ్డి విజయవంతంగా అమలుచేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే ఆయన చొరవతో టీఆర్ఎస్ జిల్లా పార్టీ నాయకత్వం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించింది.