హైదరాబాద్, జనవరి9 (నమస్తే తెలంగాణ): ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తుండటంతో రాష్ట్రం గజగజ వణికిపోతున్నది. మూడురోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడి చలి తీవ్రత పెరిగింది. 2019 తరువాత రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5 డిగ్రీలకు పడిపోవడం గడిచిన మూడేళ్లలో ఇదే రికార్డు అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో 3రోజుల వరకు శీతలగాలులు మరింత పెరగవచ్చని తెలిపారు.
గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్లో 5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్కు అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రత 4.6 డిగ్రీలు, జీహెచ్ఎంసీలో రంగారెడ్డి జిల్లా శివరా మ్పల్లెలో 7.8 డిగ్రీలుగా నమోదైంది. వచ్చే 3 రోజులు 4 నుంచి 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని అధికారులు చెప్పారు.