హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి గత నాలుగు నెలల్లో రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, మరో రూ.17 వేల కోట్ల అప్పు చేసిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా రూ.57 వేల కోట్లు ఖజానాలో చేరాయని, ఈ మొత్తాన్ని ఏం చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల వసూలుకే ప్రాధాన్యం ఇస్తున్నదని మండిపడ్డారు. ప్రతిక్షణం ఏ కాంట్రాక్టర్కు బిల్లు ఇస్తే కమీషన్ వస్తుందనే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు నిండా ముంచారని విమర్శించారు. బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు జమ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను దేనికి ఉపయోగించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, నష్టపోయిన రైతులకు తక్షణ సాయం రూ.10 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.