హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సగటున రూ.10వేల కోట్ల చొప్పున నాలుగు నెలల్లో రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చిందని బీజేపీ ఎల్పీనేత (BJP LP leader) ఏలేటి మహేశ్వర్రెడ్డి (Maheshwar Reddy) తెలిపారు. మరో రూ.17 వేల కోట్ల అప్పు చేసిందని మొత్తం రూ. 57 వేల కోట్లను ప్రభుత్వం ఏం చేసిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల వసూలుకే ప్రాధాన్యం ఇస్తున్నదని మండిపడ్డారు. ప్రతిక్షణం ఏ కాంట్రాక్టర్కు బిల్లు ఇస్తే కమీషన్ వస్తుంది? అనే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ఆర్ ట్యాక్స్ అంటే.. రేవంత్ ట్యాక్సా? రాహుల్ ట్యాక్సా అనేది తెలియదని, బీ ట్యాక్స్ అంటే బిల్స్ పెండింగ్ ట్యాక్స్ అనుకుంటున్నానని, భట్టి ట్యాక్సా అనేది కూడా తనకు తెలియదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు నిండా ముంచారని విమర్శించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రైతులు రుణాలు తీసుకున్నారని, ఇప్పుడు బ్యాంకర్లు వారికి నోటీసులు ఇస్తున్నా స్పందించడం లేదన్నారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని అసంపూర్తిగా విడుదల చేశారన్నారు.
రైతు బంధు జమ నిధుల సంగతేమిటి ?
గత ప్రభుత్వం రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లు జమ చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను దేనికి ఉపయోగించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నీటినిర్వహణ లోపం కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. తన నియోజకవర్గానికి 6 టీఎంసీలకు బదులు కేవలం 4.5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. మంత్రి శ్రీధర్ బాబు ఎస్సారెస్పీ నుంచి 8 టీఎంసీల నీటిని తన ప్రాంతానికి తరలించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.