Wardha Barrage | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ చేపట్టి నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ప్రాణహితపై బరాజ్ను నిర్మిస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అయితే ప్రాణహితపై బరాజ్ నిర్మాణం అసాధ్యమని ఇంజినీర్లు గతంలోనే తేల్చి చెప్పారు. అందువల్లనే ప్రాజెక్టును రీడిజైన్ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రాణహితపై చేపట్టాల్సిన బరాజ్ నిర్మాణాన్ని వార్ధా మీద ప్రతిపాదించింది. ఈమేరకు డీపీఆర్ను కూడా సిద్ధం చేసి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి పంపింది. తాజాగా మంత్రి ప్రకటనతో బరాజ్ నిర్మాణం మరోసారి డైలమాలో పడింది.
ఉమ్మడి ఏపీ సర్కారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును 2007లో ప్రతిపాదించింది. వార్ధా, వెయిన్గంగా నదులు కలిసిన తరువాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద రూ.2,500 కోట్లతో బరాజ్ను నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రదేశం వద్ద బరాజ్ నిర్మాణానికి సాంకేతిక సమస్యలున్నాయని అధికారులు ఆదిలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. బరాజ్ను నిర్మించాలంటే నీటి ప్రవాహం 90 డిగ్రీల లంబకోణంలో ఉండాలి. తుమ్మిడిహట్టి వద్ద పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నదని గుర్తించారు. కేవలం 45 డిగ్రీల స్క్యూ షేప్లో బరాజ్ను నిర్మించాల్సి వస్తుందని, అది అంత క్షేమదాయకం కాదని తేల్చారు.
అదీగాక ఇప్పటివరకు ఆ స్క్యూ షేప్లో బరాజ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఎక్కడా అందుబాటులో కూడా లేవని స్పష్టం చేశారు. మొత్తంగా తుమ్మిడిహట్టి వద్ద 1.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో బరాజ్ను నిర్మించాలంటే సుమారు 6 కిలోమీటర్ల మేర కాంక్రీట్ నిర్మా ణం చేపట్టాల్సి ఉంటుందని, 100 నుంచి 110 గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచ నా వేశారు. మొత్తంగా బరాజ్ నిర్మాణానికి రూ.2,500 కోట్లకు పైగా వెచ్చించాల్సి వస్తుందని, 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అంత పెద్దమొత్తం వెచ్చించడం నిరర్థకమని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రతిపాదిత తుమ్మిడిహట్టి పక్కనే చాప్రాల్ అభయారణ్యం ఉండటంతో దాదాపు 2,448 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురవుతుంది. దీంతో సీడబ్ల్యూసీ అనుమతులు పొందడానికి అనేక ఆటంకాలు ఏర్పడే అవకాశమున్నదని తేల్చి చెప్పారు.
బరాజ్ నిర్మాణంతోపాటు ఇతర అనేక సాంకేతిక కారణాలు కూడా ప్రాణహిత ప్రాజెక్టు అసాధ్యమనే తేల్చి చెప్తున్నాయి. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్కు వరకు దాదాపు 116 కిలోమీటర్ల కాలువను, 75 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల లోతుతో తవ్వాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికే 75 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పూర్తయ్యింది. ఆ తర్వాత కాలువ అలైన్మెంట్ భూమిని సింగరేణి సంస్థ గనుల కోసం డిమార్కేషన్ చేసింది. ఇప్పుడు ఈ అంశాన్ని తేల్చాల్సి ఉన్నది. 152 ఎఫ్ఆర్ఎల్ను దృష్టిలో పెట్టుకుని అనాడు కాలువలను తవ్వారు. ప్రస్తుతం బరాజ్ ఎఫ్ఆర్ఎల్ను 148 మీటర్లుగా నిర్ణయించారు. దీంతో కాలువ ద్వారా నీటిని మళ్లించడం కూడా సవాళ్లతో కూడుకున్నదేనని ఇంజినీర్లు తెలుపుతున్నారు. అనేక క్రాస్ రెగ్యులేటర్లను నిర్మించాల్సి ఉంటుందని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ నిపుణులతో సుదీర్ఘ మేధో మథనం సాగించి తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కీలక మార్పులు చేశారు. ప్రాజెక్టును 2 భాగాలుగా విభజించారు. నీటి లభ్యత ఆధారంగా మొదటగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వెయిన్గంగ, వార్ధా నదులు కలిసే తుమ్మిడిహట్టి వద్ద కూడా బరాజ్ నిర్మించాలని నిర్ణయించారు. దానికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టుగా పేరు పెట్టారు. ముంపును తగ్గించేందుకు తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తును 148 మీటర్లకు కుదించారు. ఈ మేరకు మహారాష్ట్రంతో తెలంగాణ ఒప్పందం కూడా చేసుకున్నది.
వార్దాపై బరాజ్ను నిర్మించి అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర కాలువను తవ్వి తుమ్మిడిహట్టి దిగువన కుడిమెట్టిగూడెం వద్ద ఇప్పటికే ప్రాణహితలో భాగంగా తవ్విన కాలువలతో అనుసంధానించి, ఆ కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 టీఎంసీలను నిల్వ చేయాలని ప్రణాళికలు రూపొందించింది. దీంతో ఖర్చు, ముంపు తగ్గుతుందని సర్వే సంస్థ వ్యాప్కోస్ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రాణహితపైనే బరాజ్ను నిర్మిస్తామని ప్రకటించడంతో ప్రాజెక్టు మొత్తం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొన్నదని ఇంజినీర్లు అంటున్నారు. వార్దాపై బరాజ్తోపాటు సాగునీటి కాలువల నిర్మాణానికయ్యే వ్యయాన్ని కలిపి రూ.4,550.73 కోట్లతో డీపీఆర్ రూపొందించి అనుమతుల కోసం కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమర్పించింది. దీనికి హైడ్రాలజికల్ క్లియరెన్స్లు కూడా వచ్చాయి. ఇతర విభాగాల్లో పరిశీలనలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మళ్లీ ప్రాణహితపైనే బరాజ్ నిర్మిస్తామని ప్రకటించడం చర్చనీయాంశమైంది.