హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు గిరిజన గురుకుల విద్యాలయాలను మంజూరుచేసింది. మహబూబాబాద్లో ఒకటి, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట-కోనాపూర్లో మరో గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
2023-24 విద్యా సంవత్సరం నుంచి వీటిని నిర్వహించాలని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. వీటి ఏర్పాటుకు రూ.5,37,46,200 కేటాయించింది. దీంతో రాష్ట్రంలో గిరిజన గురుకులాల సంఖ్య 185కు పెరుగనున్నది. గిరిజన బిడ్డల చదువు పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి గురుకుల విద్యాలయాలే నిదర్శమని మంత్రి సత్యవతీరాథోడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 183 గిరిజన గురుకుల పాఠశాలలు, 22 డిగ్రీ కాలేజీలు, ఐటీడీఏల పరిధిలో 332 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.