యాదాద్రి భువనగిరి, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): 65 గడపలున్న మారుమూల గిరిజన ప్రాంతమది. ఎత్తైన గుట్టల మధ్య ఉన్న ఆ ఆవాసానికి నీరందించడమంటే సాహసంతో కూడుకున్న పని. ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. అలాగనీ, తెలంగాణ ప్రభుత్వం ఆ గిరిజనుల తాగునీటి కష్టాలను గాలికి వదిలేయలేదు. నిధుల కేటాయింపునకూ వెనుకడుగు వేయలేదు. ఏకంగా రూ.కోటి ఖర్చు పెట్టి మిషన్ భగీరథ పథకంలో శుద్ధ జలాన్ని అందించింది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పరుగులు తీసిన కృష్ణమ్మ వాగులు, వంకలు దాటి వచ్చి గిరిజనుల దాహార్తిని తీర్చుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని ఐదు దోనాలతండాకు తాగు నీరందించాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వ పట్టుదలకు గిరిజనం ఫిదా అవుతున్నది. యావత్తండా సీఎం కేసీఆర్ను వేనోళ్లా పొగుడుతున్నది.
నాడు చేదబావి, చెలిమె నీళ్లు..
ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఉన్న గిరిజన ఆవాసం ఐదు దోనాలతండా. సంస్థాన్ నారాయణపురం మండలం కడీలబాయితండా పంచాయతీ పరిధిలో ఈ తండా ఉన్నది. తండాలో 65 కుటుంబాలు నివసిస్తున్నాయి. కొన్నేండ్ల క్రితం వరకు చెలిమె నీళ్లే జనానికి దిక్కు. కొంతకాలం తండా పక్కన ఉన్న చేదబావి ఆదుకొన్నది. ఆ తర్వాత స్కీం బోరు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆగిఆగి పోసే నీళ్లు.. జనం దాహాన్ని పూర్తిగా తీర్చలేకపోయాయి. స్కీం బోరు నడువకుంటే పొలాల్లోని బోరు, బావులే శరణ్యం.
కృష్ణానీటి తరలింపు ఇలా..
శ్రీశెలం ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని మహబూబ్నగర్ జిల్లాలోని సర్కిల్పాడ్ మీదుగా రంగారెడ్డి జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ముచ్చర్ల, అటు నుంచి గునగల్ వద్ద ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తీసుకొచ్చి శుద్ధి చేస్తున్నారు. ప్లాంట్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా పరిధి పటేల్ చెరువు తండా వద్ద ఉన్న సంప్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదు దోనాలతండాకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఐదున్నర కిలోమీటర్ల దూరం పైపులైన్ను వేసి రెండు మోటర్ల ద్వారా కొండ ప్రాంతంలో ఉన్న తండా ఓవర్హెడ్ ట్యాంక్లోకి తరలిస్తున్నారు. 46 నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసి గడపగడపకూ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కోటి రూపాయలను వెచ్చించింది.
సంక్షేమ పథకాలకూ ఢోకా లేదు
జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరం ఉన్న ఐదు దోనాలతండాలో సమాచార వ్యవస్థ లేదు. సెల్ఫోన్ రింగ్టోన్స్ కూడా ఇక్కడ వినిపించవు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తండాలో సంక్షేమానికి బ్రేక్ పడలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇక్కడి ప్రజలకు అందుతున్నాయి. 60 కుటుంబాలు ప్రతినెలా రేషన్ బియ్యాన్ని పొందుతున్నాయి. 20 మంది వివిధ రకాల పింఛన్లు తీసుకొంటున్నారు. తండా బయట కాలు పెట్టని ఆడ పిల్లలు నేడు నగర బాట పట్టి ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. సీఎం చొరవతో రెండేండ్ల క్రితం తండాకు మట్టి రోడ్డు సమకూరింది. పోడు భూముల్లో సాగు చేసుకొంటున్న గిరిజనులకు ప్రభుత్వం హక్కులు కల్పించి పాస్ పుస్తకాలను జారీచేయడంతో ప్రస్తుతం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాలు వర్తిస్తున్నాయి.
నేడు ఇంటింటికీ స్వచ్ఛజలం
తండా నీటి కష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం చరమగీతం పాడింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే కృష్ణాజలాలను ఐదు దోనాలతండాకు మళ్లించేందుకు సాహసమే చేసింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి మండలంలోని అనేక ఆవాసాలకు కృష్ణానీళ్లు అందుతున్నాయి. ఎత్తైన గుట్టల్లో ఉన్న ఐదు దోనాలతండాకు సరఫరా కష్టమైంది. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ చొరవతో శ్రీశైలం నుంచి వచ్చే కృష్ణానీటిని తండాకు అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నిరంతరాయంగా తండాకు మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి.
సీఎం కేసీఆర్ దేవునోలె ఆదుకున్నరు
గుట్టపై ఉన్న మా ఊరిలో నిల్వ ఉండే నీళ్లే మాకు గతి. అందుకే మా తండాకు ఐదు దోనాలతండా అని పేరొచ్చింది. గతంలో మా సమస్యలను ఎవరూ పట్టించుకోలే. టీఆర్ఎస్ సర్కారు వచ్చినంక ఇబ్బందులు తొలగుతున్నాయి. మిషన్ భగీరథ నీళ్లతో తండా ఆడబిడ్డల కష్టాలు పూర్తిగా తీరినయి. సీఎం కేసీఆర్ దేవునోలె ఆదుకున్నరు.
-కాట్రోత్ శ్రీను, గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ
కలలో కూడా అనుకోలేదు
శ్రీశైలం నుంచి నీళ్లు ఇస్తమని అధికారులు చెప్పినప్పుడు మేం నమ్మలేదు. గిప్పుడు కండ్లార చూస్తున్నం. మల్లన్న చెంత నుంచి వచ్చిన నీటిని తాగుతమని కలలో కూడా అనుకోలేదు. నీటి గోస తీర్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– కొర్ర దేవానాయక్, తండావాసి
మంచి రోజులు వస్తయనుకోలె..
నాకు డబ్బు ఏండ్లు. ఊహ తెలిసినప్పటి నుంచి చెలిమ నీళ్లు, చేదబావి నీళ్లు తాగి బతికినం. ఆడబిడ్డలు నీళ్ల కోసం పడుతున్న కష్టాలను చూసి మా తండాకు పిల్లనివ్వాలన్నా ఆలోచన జేసెటోళ్లు. గిప్పుడు ఇంటి ముందటే నీళ్లు పట్టుకునే పరిస్థితి చూసినప్పుడల్లా మంచిగ అన్పిస్తున్నది. మా తండాకు మంచి రోజులు వస్తయని ఎన్నడూ అనుకోలే.
– సపావట్ పిప్లీ, తండావాసి
ఇది తెలంగాణ మారుమూల పల్లెలో…