Siddipet | ఉమ్మడి పాలనలో గుకెడు నీటికి నోచుకోని ప్రాంతం సిద్దిపేట.. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నాలుగు దశాబ్దాలు పోరాడిన గడ్డ సిద్దిపేట. రైలు సౌకర్యం కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసిన నేల సిద్దిపేట. ఇలా కొన్నేండ్లపాటు సిద్దిపేట ప్రజలు పడిన కష్టాలు స్వరాష్ట్రంలో తీరాయి. నాడు కరువుకు నెలవుగా ఉన్న సిద్దిపేట నేడు కల్పతరువుగా మారింది. రంగనాయకసాగర్తో పుష్కలంగా సాగునీరు రావడంతో పచ్చని పంటలతో తులతూగుతున్నది. ఏండ్లనాటి సిద్దిపేట జిల్లా కల సాకారమైంది. అన్ని రంగాల్లో సిద్దిపేట అభివృద్ధికి కోటగా మారింది.
సిద్దిపేట, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒక్క పంట పండించడానికే ఆపసోపాలు పడ్డ సిద్దిపేట నేడు మూడు పంటలు పండిస్తున్నది. రంగనాయకసాగర్తో కాళేశ్వరం జలాలు చెరువులు, కుంటలు, చెక్డ్యాములను నింపడంతో పంటల సాగు పండుగగా మారింది. 2014 సంవత్సరానికి ముందు సిద్దిపేట నియోజకవర్గవ్యాప్తంగా 19 వేల ఎకరాల్లో సాగైన వరి పంట.. నేడు 90 వేల ఎకరాలకు చేరింది. సిద్దిపేట శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్తో ఈ ప్రాంతంలోని బీడుభూములన్నీ పచ్చని మాగాణాలయ్యాయి.
ఈ రిజర్వాయర్తో వ్యవసాయంతోపాటు పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. రంగనాయకసాగర్ టూరిజం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లు కేటాయించింది. ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ సెంటర్గా మార్చడానికి మంత్రి హరీశ్రావు కృషి చేస్తున్నారు. సిద్దిపేటను జిల్లాకేంద్రం చేయాలని 1984లో నాటి సీఎం ఎన్టీఆర్కు చేసిన వినతి బుట్టదాఖలు కాగా, స్వరాష్ట్రంలో 2016 అక్టోబర్ 16న జిల్లా సాకారమైంది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని వనరులు సమకూరాయి. నూతన సమీకృత కలెక్టరేట్ భవనంతోపాటు ప్రధాన శాఖల కార్యాలయ నూతన భవనాల్లోనే పాలన సాగుతున్నది. ఇటీవలనే రైలు సిద్దిపేట వరకు ప్రారంభమైంది. రోజుకు నాలుగు ట్రిప్లు సిద్దిపేట- సికింద్రాబాద్ మధ్యన నడుస్తున్నది.
సిద్దిపేట హెల్త్ హబ్గా మారుతున్నది. 2018లో కేవలం 150 మందితో ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నేడు 875 మంది చదువుతున్నారు. 13 పీజీ కోర్సుల్లో 61 మంది మెడిసిన్ పీజీ చేస్తున్నారు. బీఎస్సీ పారామెడికల్ సైన్స్ కోర్సు సైతం అందుబాటులో ఉన్నది. 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు సిద్దిపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇంటర్న్షిప్ చేస్తూ రోగులకు 24/7 సేవలందిస్తున్నారు. రూ.60 కోట్లతో సకల హంగులతో ఏర్పాటైన ఐటీ టవర్లో జిల్లా యువతీ యువకులు 450 మంది విధులు నిర్వహిస్తున్నారు.
సిద్దిపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం కేసీఆర్ నగర్ జిల్లాకే తలమానికంగా నిలిచింది. నర్సపురం వద్ద ఒకే చోట 45 ఎకరాల విస్తీర్ణంలో 2,460 ఇండ్లను జీ+2 పద్ధతిలో నిర్మించారు. ఒక్కో బ్లాక్లో 12, మొత్తం 250 బ్లాక్లు ఓకే చోట కట్టించి కష్ట జీవులు ఇచ్చారు. సీఎం కేసీఆర్ సార్ మా దేవుడంటూ వారి ఇంటిలో ఫొటో పెట్టుకొని పూజిస్తున్నారు. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సకల సౌకర్యాలు కల్పించారు. ఇలా సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయి.