హెదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుల అమలును నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపడితే ఇప్పటికే సిట్ సేకరించిన పలు కీలక ఆధారాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుందని, కేసు మొత్తం నీరుగారిపోవచ్చని ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వాలని ఇప్పటికే సీబీఐ లేఖలు రాసినట్టు తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పులతోపాటు ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై ఈ నెల 17న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో కీలక పాయింట్లు ఉంటే సీబీఐ తీసుకున్న ఫైళ్లను తిరిగి సిట్కు ఇవ్వాలని ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నది.