హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): టిప్లైన్స్ ఆధారంగా తెలంగాణలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన చైల్డ్ అబ్యూజ్ కేసుల్లో 43 మందిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర సీఐడీ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన సైబర్క్రైమ్ కేసులపై ఇటీవల రాష్ట్రస్థాయిలో సీఐడీ ఏడీజీ మహేశ్ ఎం భగవత్ సమీక్షించారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఏఎం) టిప్లైన్స్ ఆధారంగా మొత్తం 31 కేసులను సమీక్షించారని చెప్పారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ద్వారా సీఎస్ఏఎంకు సంబంధించిన టిప్స్ను ఉపయోగించి తెలంగాణ సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో బాలల అశ్లీల విషయాలను అప్లోడ్, ఫార్వర్డ్, షేర్ లాంటివి చేస్తూ చైల్డ్ అబ్యూజ్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ నెలలో 44 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. వాటిల్లో 34 కేసులు దర్యాప్తులో ఉన్నట్టు సీఐడీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే మూడేండ్ల నుంచి ఏడేండ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు.