Grama Panchayathi | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు రంగం సిద్ధమైంది. దీనిపై ఈ నెల 30న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి ఒకటితో ప్రస్తుతమున్న సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సముఖంగా లేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో కాకుండా స్పెషల్ ఆఫీసర్లతో ప్రజా పాలన చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. దాదాపు దశాబ్ద కాలం తరువాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం లో 12,769 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు రానున్నారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన అవసరం రాలేదు.
స్పెషల్ ఆఫీసర్లుగా మండలంలో అందుబాటులో ఉండే ఎంపీడీవో, ఎంపీవో, తహిసీల్దారు, గెజిటెడ్ హోదా ఉన్న ఇతర శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. ఆ మండలంలో ఉన్న పంచాయతీల సంఖ్య అధారంగా ఇతర శాఖల అధికారుల సేవలను వినియోగించుకుంటారు. ప్రస్తుతం చిన్న మండలాలు కావడంతో ఇతర శాఖల అధికారుల సేవలు తక్కువ సంఖ్యలో అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ దృష్టి పెట్టలేదు. బీసీ గణన చేస్తే కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలులేకపోవడంతో పీటముడి పడింది. బీసీ గణన చేసి వారికి రిజర్వేషన్లను ఖరారు చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.