నిర్మల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. దాదాపు 40 ఏండ్ల క్రితం అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసీలను బలి తీసుకున్నారని ఆరోపించారు. మంగళవారం నిర్మల్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అప్పట్లో సంచలనం సృష్టించిన ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించిందని అన్నారు. ఈ మారణకాండలో 250 మందికిపైగా ఆదివాసీలు మరణించినట్టు చెప్పారు. గత చరిత్ర తెలియని ఇప్పటి కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఇంద్రవెల్లిలో సభ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు.
60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు ఆదివాసీలను పట్టించుకున్న పాపాన పోలేదని, కేవలం గిరిజనుల ఓట్ల కోసమే ఇంద్రవెల్లిలో రేవంత్రెడ్డి సభ పెట్టారని విమర్శించారు. ఈ సభలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను దూషించడానికే రేవంత్రెడ్డి అధిక ప్రాధాన్యతనిచ్చారని, సీఎం మాట్లాడిన భాషపై చిన్న పిల్లలు, మహిళలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.
తమ ప్రాంతానికి సీఎం వస్తే అభివృద్ధి జరుగుతుందని, నిధులు మంజూరు చేస్తారని ఆదివాసీలు ఆశించారని, వారి ఆశలను వమ్ము చేస్తూ గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం నయా పైసా మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వమే రూ.ఆరు కోట్లు మంజూరు చేసిందన్నారు. తప్పుడు వాగ్ధ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజలతో కలిసి పోరాడుతామని హెచ్చరించారు.