హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ కృషి, పట్టుదలతో తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఫాక్స్కాన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ యంగ్ లియూ ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పి నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించడం వల్లనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని దామోదర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సులభంగా అనుమతులిచ్చేందుకు టీఎస్ ఐపాస్ పేరుతో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల రాష్ర్టానికి రూ.2.53 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 17.56 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు.
దేశ చరిత్రలోనే అత్యంత భారీ పెట్టుబడిని తెలంగాణలో పెట్టేందుకు ఫాక్స్కాన్ ముందుకు రావడం గొప్ప విషయమని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని మరింత పరుగులు తీయించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందని పేర్కొన్నారు. అమెజాన్, గూగుల్, యాపిల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు తరలిరావడం వెనుక మంత్రి కేటీఆర్ కృషి అమోఘమని ప్రశంసించారు. తెలంగాణ గడ్డను సాంకేతిక అడ్డాగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కే దక్కుతుందని దామోదర్ పేర్కొన్నారు.