హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): దేశంలో అడవుల పునరుద్ధరణకు నడుం బిగించిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ జోరుగా ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా సీడ్ కాప్టర్ల (డ్రోన్ల) ద్వారా అడవుల్లో విత్తన బంతుల (సీడ్ బాల్స్)ను చల్లే రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే తెలంగాణ సహా 7 రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో ‘హరాభరా’ పేరుతో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టామని, దీన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఇతర రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను చల్లేందుకు అనుమతిచ్చిందని మారుత్ డ్రోన్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రేమ్ వివరించారు.
అంతరించిపోతున్న అటవీ సంపదను పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, వివిధ కార్పొరేట్ కంపెనీలతో కలిసి దేశవ్యాప్తంగా 1,400 జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సీడ్ కాప్టర్ల ద్వారా విత్తన బంతులను చల్లనున్నామని తెలిపారు. సీడ్ బాల్స్ తయారీ బాధ్యతలను సహాయ సహాయక సంఘాలకు అప్పగించామని, తద్వారా వేల మంది మహిళలకు ఉపాధి లభిస్తున్నదని చెప్పారు.