రాజన్న సిరిసిల్ల, జూన్ 18 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మరో లక్ష ఎకరాలకు సాగునీరందించే బృహత్కర కార్యం రూపుదాల్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలోని ఏడు గుట్టల మధ్య రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన 3 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ పనులు పూర్తి కాగా, ఆదివారం తెల్లవారుజామున అధికారులు రెండో మోటర్ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. 9వ ప్యాకేజీ ఈఈ గంగం శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షణలో అధికారులు రెండు గంటలపాటు శ్రమించారు. సంప్హౌస్ నుంచి 130 మీటర్ల ఎత్తున ఉన్న బండ్లోకి నీటిని ఎత్తిపోశారు.
గత నెల 23న మొదటి మోటర్ ట్రయల్ రన్ను నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో మోటర్ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. మల్కపేట ప్రాజెక్టుతో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరందనున్నది. 25 రోజుల్లో రెండోమోటర్ ట్రయల్ రన్ దిగ్విజయం చేసిన అధికారులను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా అభినందించారు. త్వరలో సీఎం చేతుల మీదుగా మల్కపేట రిజర్వాయర్ను ప్రారంభిస్తామని ఇటీవల ఆయన సిరిసిల్ల పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో జిల్లా వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.