హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): చేనేతపై ‘జీరో జీఎస్టీ ఉద్యమం’ ద్వితీయ వార్షికోత్సవాన్ని నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఈ నెల 5న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 శాతం జీఎస్టీ పన్నును పరిహారంగా చెల్లిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి అధ్యక్షతన కొనసాగే ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పద్మశాలి ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘం నేతలు పాల్గొనాలని కోరారు.