School Timings | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను పాఠశాల విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఉదయం 9 గంటలకే బడులు ప్రారంభమవుతాయని పేర్కొన్నది. 2024 -25 విద్యాసంవత్సరం నుంచి తాజా పనివేళలు అమల్లో ఉంటాయని ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రకటించారు. గతంలో 9 గంటలకే బడులు ప్రారంభమయ్యేవి. కానీ, అప్పట్లో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రాథమిక పాఠశాలల బడివేళలను ఉదయం 9:30 గంటలకు మార్చారు.
ఒకే ఇంట్లో ఇద్దరు విద్యార్థులుంటే ఒకరిని ఉదయం 9గంటలకు, మరొకరిని ఉదయం 9:30 గంటలకు బడికి తీసుకెళ్లాల్సి ఉండటంతో తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారని, కావున మార్చాలని అప్పట్లో కోరగా బడి పనివేళలను మార్చారు. మళ్లీ ఇప్పుడా నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలను తిరిగి ఉదయం 9గంటలకే ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. సాయంత్రం 4:45 గంటల వరకు నిర్వహిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నడుపుతారు.
జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట
సర్కారు బడుల్లో బడిబాట షెడ్యూల్ను విద్యాశాఖ ఖరారు చేసింది. అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు ఏటా మాదిరిగానే, ఈ సారి కూడా జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట నిర్వహించనున్నారు. 2024 -25 విద్యాసంవత్సరం జూన్ 12న ప్రారంభం కాగా, 2025 ఏప్రిల్ 23న ముగియనున్నది. 229రోజుల పాటు బడులను నిర్వహిస్తారు. 2024 -25 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్ను ఎస్సీఈఆర్టీ శనివారం విడుదల చేసింది. 2025 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. పదో తరగతి సిలబస్ను 2025 జనవరి 10లోపు, 1 నుంచి 9 తరగతుల సిలబస్ను 2025 ఫిబ్రవరి 28లోపు పూర్తిచేస్తారు. బడుల్లో యోగా, ధ్యానాన్ని తప్పనిసరిచేశారు.