(హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
ఒకాయన అమాయక నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఉద్యోగాలిప్పిస్తానంటూ యువతీ యువకులను నిలువు దోపిడీ చేసి ఏకంగా రూ.50 కోట్లు కొల్లగొట్టాడు. ఆ ఘరానా మోసగాడికి బీజేపీ నాయకులు కాషాయ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు.
మరొకాయన అభం శుభం తెలియని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఛిద్రం చేసేందుకు కుట్ర పన్ని, పదో తరగతి పేపర్ను లీక్ చేయించాడు. అలాంటి దుర్మార్గుడు జైలు నుంచి విడుదల కాగానే బీజేపీ నేతలు పూలదండలు వేసి సన్మానించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో కీలక నిందితుడైన వ్యక్తికీ కాషాయ పార్టీతో లింకులుంటాయి. అతని సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే బీజేపీ నేతలతో దిగిన ఫొటోలు దర్శనమిస్తాయి.
ఏకంగా 40 వేల మంది నిరుద్యోగులను మోసగించి రూ.50 కోట్లు కొల్లగొట్టిన ‘సిద్దిపేట శ్రీమంతుడు’ గడగోని చక్రధర్గౌడ్కు బీజేపీ నేతలు అండగా నిలవడం విస్మయాన్ని కలిగిస్తున్నది. చక్రధర్గౌడ్ లాంటి నిందితులను కఠినంగా శిక్షించి, యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేయాల్సిన బీజేపీ నేతలు.. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగానే మీడియా ముందుకొచ్చి ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తద్వారా ఆ ఘరానా మోసగాడితో తమకున్న లింకులను వాళ్లే బహిర్గతం చేసుకున్నారు. చక్రధర్గౌడ్ సోషల్ మీడియా అకౌంట్ను పరిశీలిస్తే.. ఆయన తెలంగాణ బీజేపీ నేతలతో దిగిన ఎన్నో ఫొటోలు దట్శనమిస్తున్నాయి.
బీజేపీ నేతలు ఇలాంటి వారితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం కొత్తేమీ కాదు. ఇటీవల పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిందితుడు ప్రశాంత్కు బహిరంగంగానే మద్దతు పలికారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రాజశేఖర్రెడ్డికి కూడా బీజేపీ నేతలతో సంబంధాలున్నాయి.