హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులు, కార్మిక జేఏసీ ఊహించినట్టుగానే సమ్మె నోటీసులపై చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం డుమ్మా కొట్టింది. సమ్మెపై కార్మిక సంఘాలతో చర్చిస్తే ఎలాంటి హామీలు ఇవ్వాల్సి వస్తుందోననే భయంతో ప్రభుత్వ పెద్దల సూచన మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు లేబర్ కమిషన్ చర్చలకు గైర్హాజరయ్యారు. గురువారం ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని లేబర్ కమిషన్ కార్యాలయంలో కన్సాలియేషన్ సమావేశం జాయింట్ లేబర్ కమిషనర్ సునీతాగోపాల్దాస్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి జేఏసీ నేతలు, ఆర్టీసీ ఉన్నతాధికారులు కచ్చితంగా హాజరుకావాలని ఆమె లేఖలు పంపారు.
అయితే, సమావేశానికి కార్మిక సంఘాల నేతలు హాజరైనా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం హాజరుకాలేదు. కార్మిక నేతలతో మాట్లాడిన జాయింట్ లేబర్ కమిషనర్.. ఈ నెల 13న మరోసారి సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. యాజమాన్యం చర్చలకు హాజరుకాకపోవడంపై జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా కార్మిక జేఏసీ నేతలు మాట్లాడుతూ.. సమ్మె నోటీస్ ఇచ్చి నెల కావస్తున్పటికీ యాజమాన్యం మొండివైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. గతంలోనూ ఇలాగే పలుమార్లు గైర్హాజరై చర్చలకు రాకుండా సమ్మె నోటీసులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. లేబర్ కమిషన్ సూచనను గౌరవించి మరోసారి చర్చలకు ఒప్పుకొన్నామని చెప్పారు. ఈ నెల 13న కూడా చర్చలకు హాజరుకాకపోతే అదేరోజున సమ్మె తేదీ ప్రకటిస్తామని హెచ్చరించారు. శుక్రవారం చేపట్టిన ‘కార్మిక గర్జన’ను వాయిదా వేస్తున్నట్టు జేఏసీ నేతలు, మీడియా ఇన్చార్జి పాటి అప్పారావు ప్రకటించారు.