హైదరాబాద్ : రాష్ట్రంలో 60 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావడానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అంకితభావంతో కృషి చేయాలని పంచాయతీరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మినిస్టర్ క్వార్టర్స్ లో సోమవారం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారుల 2022 సంవత్సరపు డైరీ, క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మండల పరిషత్ అధికారుల, ఇతర అధికారుల, ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించి అర్హులైన అందరికీ ప్రమోషన్లు ఇచ్చారని ఆయన తెలిపారు.
అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధికి గత మూడేళ్ల కాలంలో 7 వేల 203 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు నేరుగా విడుదల చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు.
పల్లె ప్రగ్రతి కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్ లు, ఇతర కార్యక్రమాల వల్ల గ్రామాల రూపురేఖలు మారాయని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు గణనీయమైన కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించరాని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈఓ అసోసియేషన్ అధ్యక్షులు కె.రాఘవేంద్రరావు, రాష్ట్ర ఎం.పి.డి.ఓ ల అసోసియేషన్ అధ్యక్షుడు సత్తయ్య, ప్రధాన కార్యదర్శి జి చంద్రశేఖర్, టి.జి.ఓ ల రాష్ట్ర జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, రాష్ట్ర ఎంపీడీవోల సంఘం ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, పబ్లిసిటీ సెక్రటరీ నాగేందర్ రెడ్డి, రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.