హైదరాబాద్, మే 29(నమస్తే తెలంగాణ) : వానకాలం రాకముందే యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. యూరియా నిల్వలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలే తప్ప తామేమీ చేయలేమని స్పష్టంచేసింది. యూరియా సరఫరా ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని, యూరియా తెప్పించే బాధ్యత బీజేపీ నాయకులదే అని వారి మీదికి నెట్టింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్ర అవసరాలకు ఎంత యూరియా కావాలో అంత డిమాండ్ను తాము వ్యవసాయ శాఖ తరఫున లిఖితపూర్వకంగా పార్లమెంట్, రాజ్యసభ సభ్యులకు అందజేస్తామని చెప్పారు. వ్యవసాయ సీజన్లో రైతులు యూరియా కోసం ఇబ్బందులుపడే పరిస్థితి వస్తే ఊరుకోబోం అని హెచ్చరించారు.
రాష్ట్ర బీజేపీ నేతలు బాధ్యత తీసుకొని కేంద్రం నుంచి యూరియా తెప్పించాలని కోరారు. దీనిపై ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. యూరియా సప్లయ్ విషయంలో ఎలాంటి జాప్యం జరిగినా అది తెలంగాణ రైతాంగానికి తీవ్రనష్టం కలిగిస్తుందని, అప్పుడు ఎకడికకడ బీజేపీ నాయకత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. గత పంట సమయంలోనూ యూరియా కో సం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొన్నారు. యూరియా కోసం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో క్యూలు దర్శనం ఇచ్చాయి. ‘ఒక బస్తా అయినా ఇప్పించండి..’ అంటూ రైతులు అధికారుల కాళ్లు పట్టుకున్న వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మంత్రి ప్రభాకర్ మాటలను బట్టి చూస్తే.. ఈసారి కూడా యూరియా తిప్పలు తప్పకపోవచ్చని అంటున్నారు.