CAG | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏటికేడు ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతి పైసాను ప్రజలకు పంచడంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ పటిష్ఠ ప్రణాళికలతో రాష్ట్రం అద్భుతంగా ఎదుగుతున్న తీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక మరోసారి కండ్లకు కట్టింది. ఆగస్టు నెలకు సంబంధించి శనివారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని తొలి 5 నెలల్లోనే తెలంగాణ రూ.99,106.68 కోట్ల రాబడిని సాధించింది. ఇది ఈ ఏడాది మొత్తం బడ్జెట్ అంచనా (రూ.2,59,861.91 కోట్లు)లో 38.14 శాతానికి సమానం. నిరుడు ఇదే సమయంలో వచ్చిన రాబడి కంటే రూ.19,099.04 కోట్లు అధికం. గతేడాది మొత్తం రూ.2,45,256.61 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా, ఆగస్టు వరకు రూ.80,007.64 కోట్ల రాబడి వచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపేణా మొత్తంగా రూ.50,942.66 కోట్లు ఖజనాకు చేరవచ్చని బడ్జెట్లో అంచనా వేయగా, ఆగస్టు వరకు రూ.18,754.10 కోట్ల రాబడి వచ్చింది. ఇది మొత్తం బడ్జెట్ అంచనాలో 37 శాతానికి సమానం. నిరుడు ఇదే సమయంలో వచ్చిన జీఎస్టీ రాబడి కంటే రూ.2,421.93 కోట్లు అధికం.