కాచిగూడ, ఏప్రిల్ 25: సీఎం కేసీఆర్ ఒకేసారి తెలంగాణలో 80 వేల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీచేయడం చరిత్రాత్మకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. గ్రూప్-1 కోటాలో 50 శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్, గ్రూప్-2 కోటాలో 40 శాతం పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం సీఎస్ సోమేశ్కుమార్ని కలిసి ఆర్ కృష్ణయ్య వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1, గ్రూప్-2 కోటాల సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకొంటానని చీఫ్ సెక్రటరీ హామి ఇచ్చినట్టు కృష్ణయ్య తెలిపారు. అప్షన్ పద్ధతి-వెయిటింగ్ లిస్టు పద్ధతిని అమలుచేయాలని పేర్కొన్నారు.డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా యువతను ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకుంటే అవినీతికి తావులేకుండా, పరిపాలన సజావుగా సాగుతుందని అన్నారు. చీఫ్ సెక్రటరీ కలిసిన వారిలో చంటి ముదిరాజ్, రామకృష్ణ, మట్ట జయంతిగౌడ్ పాల్గొన్నారు.