హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏల రెగ్యులరైజ్లో భాగంగా కనీస విద్యార్హత కలిగిన 5,073 మందిని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి శాఖకు కేటాయించింది. వారిలో 3,905 మందిని లష్కర్లుగా, 1,168 మందిని హెల్పర్లుగా నియమించనున్నది. ఇప్పటికే 33 జిల్లాల వారీగా కేటాయింపు ప్రక్రియ పూర్తయింది.
అందులో నల్లగొండ జిల్లాకు 512 మంది, ఖమ్మం 362 మంది, సిద్దిపేట 356, సూర్యాపేట 334, నిజామాబాద్ 308, యాదాద్రి-భువనగిరి 205, సంగారెడ్డి 186, కామారెడ్డి 182, నాగర్కర్నూల్ 168, రాజన్న సిరిసిల్ల 161, కరీంనగర్ 151, భద్రాద్రి కొత్తగూడెం 143, మెదక్ 141, నారాయణపేట 137, నిర్మల్ 128, మెదక్ 127, వనపర్తి 125, జయశంకర్ భూపాలపల్లి 119, జనగాం 119, వరంగల్ 116, హన్మకొండ 115, కుమ్రంభీం ఆసిఫాబాద్కు 111, మహబూబ్నగర్ 110, జగిత్యాల 106, జోగులాంబ గద్వాల 101, మహబూబాబాద్ 101, పెద్దపల్లి 96, ములుగు 89, ఆదిలాబాద్ 88, రంగారెడ్డి 56, వికారాబాద్ 48, మేడ్చల్-మల్కాజ్గిరి 22, హైదరాబాద్ జిల్లాకు నలుగురి చొప్పున లష్కర్లు, హెల్పర్లుగా ఉన్నతాధికారులు కేటాయించారు.
నీటిపారుదల శాఖలో చేరనున్న వీఆర్ఏలకు వాలంతరీ (వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) ద్వారా శిక్షణ అందివ్వాలని ఆ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ట్రైనింగ్ మాడ్యుల్ను కూడా సిద్ధం చేసింది. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా 87 మంది శిక్షకులకు ప్రత్యేక శిక్షణ కూడా పూర్తయింది. వారితో జిల్లాల వారీగా 12 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆ శాఖ నిర్ణయించింది.