హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాల నుంచి పసిపిల్లలను కొని హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆర్ఎంపీతో ఎనిమిది ఉన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులను విచారణలో అంతరాష్ట్ర పసిపిల్లల విక్రయాల గుట్టు రట్టయ్యింది. మంగళవారం హైదరరాబాద్ నెరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్లో రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న మేడిపల్లి పోలీసులకు పసిపిల్లల విక్రయాలపై వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఐతే శోభారాణి, ఉప్పల్ ఆదర్శనగర్కు చెందిన స్వప్న, రామకృష్ణానగర్కు చెందిన సలీం పాషాను అరెస్టు చేశారు.
వీరు హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో పిల్లలు లేని వారితో ఒప్పందాలు చేసుకొని రూ. 1.8 లక్షల నుంచి రూ. 5.5 లక్షల వరకు పసిపిల్లలను విక్రయిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఢిల్లీ, పుణెల నుంచి పసిపిల్లలను కొని తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాలలోని పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి ముఠాలో అన్నోజిగూడకు చెందిన సెక్యూరిటీ గార్డు బండారి హరిహర చేతన్, అతని తల్లి బండారు పద్మ, విజయవాడకు చెందిన బల్గం సరోజ, ముదావత్ శారద, ముదావత్ రాజు, పతాన్ ముంతాజ్, జగన్నాథం అనురాధ, చర్లపల్లికి చెందిన యాత మమత ఉన్నట్టు గుర్తించి మంగళవారం ఈ 8 మందిని అరెస్ట్ చేశారు.
ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణెకు చెందిన కన్నయ్య అక్కడి నుంచి పిల్లలను ఈ ముఠాకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ ముఠా 50మంది పసిపిల్లలను రెండు తెలుగు రాష్ర్టాలలో విక్రయించినట్టు గుర్తించారు. అందులో 11మంది పసిపిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో సమన్వయం చేసుకొని రెస్క్యూ చేసి, శిశువిహార్కు అప్పగించినట్టు సీపీ వెల్లడించారు. బండారి పద్మ, బల్గం సరోజ, ముదావత్ శారదలపై ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోనూ కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. ముంబయిలో నమోదైన కేసులో శారద పరారీలో ఉందని సీపీ వెల్లడించారు. పిల్లలను కొనుగోలు చేయడం నేరమని, దత్తత తీసుకోవాలనుకునే వారు అధికార వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే పోలీసులు పసిపిల్లలను శిశువిహార్కు తరలిస్తుంటే కొన్న తల్లిదండ్రులు కమిషనరేట్కు చేరుకొని రోదించారు.