హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): వాయుకాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. తెలంగాణలో మాత్రం అది తగ్గుముఖం పట్టింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో గాలిలో నాణ్యత 11 శాతం పెరిగింది. హైదరాబాద్లో గురువారం జరిగిన కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక సమావేశంలో రాష్ట్రంలో వాయు కాలుష్యం, గాలిలో నాణ్యత తదితర అంశాలపై చర్చించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి ఎన్ కృష్ణ ఆదిత్యతోపాటు బోర్డు సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాన్పూర్ ఐఐటీ అధ్యయనం వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. వాతావరణ సమతుల్యత, కాలుష్య నియంత్రణ, గాలిలో నాణ్యత పెరుగుదల కోసం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) కింద రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు కృష్ణ ఆదిత్య తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారంతో పచ్చదనం గణనీయంగా పెరిగిందని వివరించారు. గ్రీన్బెల్ట్ను అభివృద్ధి చేయడం, స్మార్ట్లైట్లను ప్రవేశపెట్టడం, బ్లాక్టాప్ రోడ్లు వేయడం వంటి చర్యలతో వాయు కాలుష్యం తగ్గిందని చెప్పారు.