Minister Gangula Kamalakar | హైదరాబాద్/కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిగా దూసుకెళ్తున్నది. ఈ యాసంగి సీజన్ రాష్ట్ర చరిత్రలోనే రెండో అత్యధిక కొనుగోళ్ల రికార్డును నెలకొల్పనున్నది. ఇప్పటివరకు పౌరసరఫరాల సంస్థ సుమారు 10 లక్షల మంది రైతుల నుంచి 62 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.12,450 కోట్లు వెచ్చించింది. ఇప్పటికే 4,500 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తికాగా వాటిని మూసివేశారు.
రానున్న వారం, పది రోజుల్లో మరో ఐదు నుంచి ఏడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2020-21 యాసంగి సీజన్లో అత్యధికంగా 92 లక్షల టన్నులు, 2019-20లో 64 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ సీజన్ ముగిసేలోగా సుమారు 67 నుంచి 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇది రెండో అత్యధిక రికార్డు కానున్నది. ఈ యాసంగి ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో, నిజామాబాద్ రెండో స్థానంలో నిలిచాయి.
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు రైతులను అనేక ఇబ్బందులు పెట్టినట్టు విమర్శలున్నాయి. తేమ, తాలు పేరుతో అడ్డగోలుగా తరుగు తీస్తూ రైతులకు నష్టం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మిల్లర్ల పెట్టే బాధల నుంచి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం ధాన్యాన్ని మిల్లులకు పంపించకుండా ఇంటర్మీడియట్ గోదాముల్లో నిల్వ చేసంది. దీంతో తాలు, తేమ తరుగు లేకుండా ధాన్యాన్ని గోదాముల్లోకి తరలిస్తున్నారు.
ఈ యాసంగి సీజన్లో శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా రూ.12,450 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఇప్పటికే రూ.ఆరు వేల కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మిగిలిన డబ్బులను ఈ నెల 15 లోపు ప్రతి ఒక్క రైతుకు చెల్లిస్తామని చెప్పారు. శనివారం ఆయన కరీంనగర్లోని కేసీఆర్ గెస్టుహౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 62 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. గత జూన్ 10వ తేదీ నాటికి కొనుగోలు చేసిన ధాన్యం కంటే 14 లక్షల టన్నులు అధికమని తెలిపారు.
ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన 4,500 కేంద్రాలను మూసివేశామని, మిగిలిన వాటిని 16న మూసివేస్తామని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు పూర్తయినప్పటికీ కొంతమంది కొనుగోలు చేయడం లేదంటూ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ధరణిని రద్దు చేస్తామనేపార్టీలనే ప్రజలు శాశ్వతంగా రద్దు చేస్తారని మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చారు. భూ వివాదాలకు చెక్ పెట్టి ఎవరి హక్కులు వారికి కల్పించడమే ధ్యేయంగా సీఎం ధరణిని తెచ్చారని, తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు.