హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై నుంచి సీఐ, డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ ప్రమోషన్లు వచ్చాయి. ఇదే క్రమంలో సీఐ నుంచి డీఎస్పీ ప్రమోషన్లు కూడా ఈ వారంలోనే పూర్తికానున్నాయి. ఇందుకు సంబంధించి మంగళవారం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ కమిటీ ప్రమోషన్లకు అర్హులైన వారి జాబితాను ఇప్పటికే తయారు చేసిందని, లిస్టులో ఉన్న ఇన్స్పెక్టర్ల అర్హతలను బట్టి తుది జాబితాను ఆమోదించనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో దాదాపు 150 నుంచి 160 మంది వరకు ఇన్స్పెక్టర్లు డీఎస్పీలుగా పదోన్నతులు పొందనున్నారు. డీపీసీ నివేదిక వచ్చిన మూడు నాలుగు రోజుల్లో ప్రమోషన్లపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో కొంతకాలంగా ఎదురుచూస్తున్న సీఐల పదోన్నతుల కల నెరవేరనున్నది.