హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): న్యాయపరమైన చిక్కులు, కోర్టు ఆటంకాలను తొలగించి బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరింది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. జీవో-317తో తలెత్తిన ఉపాధ్యాయుల ఇబ్బందులను తొలగించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు సీహెచ్ రాములు, దుర్గాభవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి, మాణిక్రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.