నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘జాతీయ స్థాయి కథల పోటీ – 2022’ బహుమతి ప్రదానోత్సవాన్ని నేడు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనున్న ఈ వేడుకకు మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, దేశపతి శ్రీనివాస్, ‘బలగం’ వేణు, నమస్తే తెలంగాణ ఎడిటర్ టి. కృష్ణమూర్తి తదితరులు అతిథులుగా హాజరుకానున్నారు.
కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రవీంద్రభారతి మినీహాల్లో ఇష్టాగోష్ఠి ఉంటుందని, సాయంత్రం 5:30 గంటలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ప్రతినిధి వేముల శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే వేదికపై దివంగత అలిశెట్టి ప్రభాకర్కు మరణానంతరం ‘నవకవితాభిమన్యు’ బిరుదుతోపాటు, ఆయన భార్యకు లక్ష రూపాయల నగదు పురస్కారం అందజేయనున్నట్లు వెల్లడించారు.