Dharani | హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్తోపాటు రాష్ట్రంలో భూ సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీ బుధవారం సచివాయంలో సుదీర్ఘంగా సమావేశమైంది. కమిటీ సభ్యులు రేమండ్ పీటర్, సునీల్ కుమార్, కోదండరెడ్డి, మధుసూదన్, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సీఎంఆర్వో డైరెక్టర్ లచ్చిరెడ్డి హాజరయ్యారు. సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతోపాటు ధరణి సాఫ్ట్వేర్ను నిర్వహిస్తున్న టెర్రాసిస్ కంపెనీ ప్రతినిధులు సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్లు కమిటీ సూచన మేరకు ఏడు అంశాలపై సమగ్ర వివరాలను అందజేశారు.
ఈ సందర్భంగా భూ సమస్యలను మూడు మార్గాల్లో పరిష్కరించవచ్చని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. సాఫ్ట్వేర్ మార్పులు, వ్యవస్థాగత మార్పులు, చట్టపరమైన మార్పులు అవసరమని వారు అభిప్రాయపడినట్టు సమాచారం. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో ప్రస్తుతం రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరని, ఇది దరఖాస్తుల పరిష్కారంపై ప్రభా వం చూపుతున్నదని కమిటీ గుర్తించింది.