ఎల్కతుర్తి, జనవరి 22 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో కొడుకులు తనను పోషించడం లేదంటూ ఓ పూజారి తనకున్న అసైన్డ్ భూమిని గ్రామపంచాయతీకి రాసిచ్చారు. గ్రామంలో పూజారు లు ఎవరూ లేకపోవడంతో 50 ఏండ్ల క్రితం భీమదేవరపల్లి మండలం కొప్పూర్కు చెందిన నాగిళ్ల వెంకటేశ్వర్లును పెంచికల్పేటకు తీసుకొచ్చారు.
ఆ సమయంలో అతని జీవనోపాధి కోసం 4.38 ఎకరాల భూమిని సాగుకోసం కేటాయించారు. అప్పటినుంచి వెంకటేశ్వర్లు సదరు భూమిలో పంటలు పండిస్తూ గ్రామం లో పౌరోహిత్యం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
ఇటీవల భార్య మరణించడం.. కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో అతడి బాగోగులు చూసుకునే వారు కరువయ్యారు. తనను వృద్ధాప్యంలో పోషించేవారులేరని మనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలోనే ఆలయంలో మరో పూజారిని నియమించారు. దీంతో గతంలో గ్రామస్తులు తనకు కేటాయించిన భూమిని తిరిగి గ్రామానికే ఇస్తానని వెంకటేశ్వర్లు నిశ్చయించుకున్నాడు. గురువారం గ్రామసభ ఏర్పాటు చేయగా, భూమిని తిరిగి గ్రామపంచాయతీకి కేటాయిస్తానని గ్రామపంచాయతీ లెటర్ప్యాడ్పై సంతకం చేశాడు. వెంకటేశ్వర్లు నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తంచేశారు.