కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఖరి.. కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నట్టుగా ఉన్నది. కార్పొరేట్లకు రూ. లక్షల కోట్ల రాయితీలను అప్పనంగా కట్టబెడుతున్న కేంద్రం.. రైతుల నోట్లో ఎప్పటిలాగే మట్టికొట్టబోతున్నది. ఎరువుల సబ్సిడీకి బడ్జెట్లో కేటాయించిన అరకోర నిధులను కూడా గణనీయంగా తగ్గించబోతున్నది. ఈ మేరకు వ్యవసాయ, ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఎరువుల సబ్సిడీకి మంగళం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది ఎరువులపై ఇచ్చే సబ్సిడీ నిధుల్లో కేంద్రం 22.25 శాతం కోత విధించింది. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనిపై అన్నదాతలు ఇప్పటికే భగ్గుమంటున్నారు. అయితే, ఇవేమీ పట్టించుకోని బీజేపీ సర్కార్ మరో అడుగు ముందుకేసి ఎరువుల సబ్సిడీకి ఈ ఏడాది కేటాయించిన రూ.1.75 లక్షల కోట్లను మరింతగా తగ్గించడానికి యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
రైతులకు ప్రయోజనం దక్కకూడదనే..
అమ్మోనియా, ఫాస్పరిక్ యాసిడ్తో పాటు ఎంవోపీ, డీఏపీ, 10:26:26, 28:28:0, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ ధరలు గత కొంతకాలంగా క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా యూరియా తయారీలో ప్రధానమైన అమ్మోనియా ధరల్లో జనవరి-ఫిబ్రవరిలో 12 శాతం తగ్గుదల నమోదవ్వగా, మార్చి 17 నాటికి ఏకంగా 39 శాతం క్షీణించాయి. ఫలితంగా యూరియాతో పాటు ఇతర ఎరువుల ధరలు దిగివచ్చాయి. దీంతో ఎరువులపై ఇప్పటికే ప్రకటించిన సబ్సిడీని తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఫలితంగా ఎరువుల ధరలు తగ్గడంతో రైతులకు చేరాల్సిన ఆర్థిక ప్రయోజనం కేంద్ర ఖజానాకు మళ్లుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మంగళం పాడాలనే..
దేశంలో సేవలు, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయరంగమే ఆయువు పట్టు. దేశంలోని రైతుల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులే. వీరిపై ఎరువుల భారం పడకుండా చూసేందుకు దశాబ్దాల నుంచీ ప్రభుత్వాలు ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నాయి. కొన్నేండ్లుగా దేశంలో సాగుభూమి విస్తీర్ణం పెరగటంతోపాటు, వాణిజ్య పంటల సాగు కూడా పెరగటంతో రసాయనిక ఎరువుల వాడకం కూడా పెరిగింది. ఇది ఏటా పెరుగుతూనే ఉన్నది. దానితోపాటే ప్రభుత్వం ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ పెంచాల్సిన అవసరమున్నది. కానీ, బీజేపీ సర్కారు ఆ విషయాన్ని వదిలేసి ఎరువుల సబ్సిడీ భారాన్ని వదిలించుకోవటం గురించే ఆలోచిస్తున్నది. ఇందులో భాగంగానే, సేంద్రియ సాగును ప్రోత్సహించే ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని తీసుకొచ్చినట్టు వాదనలు ఉన్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ ఈ ఆర్థిక సంవత్సరం ఎరువులపై ఇచ్చే సబ్సిడీకి కేంద్రం 22.25 శాతం కోత విధించడం గమనార్హం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై సబ్సిడీ రూ. 2,25,200.16 కోట్లుగా ఉంది.