హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9:38 గంటలకు చోరీ అయిన కారును రాత్రికల్లా బాధితుడికి పోలీసులు అప్పగించారు. కారు చోరీకి గురైన వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. మధ్యాహ్నం 2:17 గంటలకు అనుమానితుడిని గుర్తించి, 5:35 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 10:55 గంటలకు కారును బాధితుడికి అప్పగించారు. ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బంది మహేందర్, రాఘవేందర్తో పాటుగా పోలీసుశాఖ డీజీపీ, సైబరాబాద్ కమిషనరేట్ల డీసీపీ, ఏసీపీలకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు. కారు చోరీ సమయం నుంచి అతని చేతికి వచ్చేంత వరకూ జరిగిన సన్నివేశాలను అతని స్నేహితుడు సాయి అభియన్ చేపూరి తన ట్విట్టర్(ఎక్స్) అకౌంట్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పోలీసు వ్యవస్థకు ఇరువురు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టుకు 54వేల వ్యూస్ రాగా, వందల్లో లైకులు వస్తున్నాయి.