హనుమకొండ : ప్రజలు సుఖ శాంతులతో స్వేచ్ఛగా జీవించాలంటే శాంతిభద్రతలు ప్రాధాన్యత ఎంతో ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ గణనీయమైన కృషి చేస్తున్నాదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముగింపు సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించలేక పోయారని, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చొరవ తీసుకొని ఈ క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పోలీస్ స్పోర్ట్స్ అండ్ మీట్స్ నిర్వహించాలని ఆయన సూచించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడు ఒత్తిడితో ఉండే పోలీస్ అధికారులు, పోలీసుల కోసం పోలీస్ మీట్ నిర్వహించడం మంచి విషయమన్నారు. ఈ క్రీడలు పోలీసుల మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.
పోలీస్ శాఖ పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాదని ఆయన వివరించారు. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డిప్యూటీ కమిషనర్లు పుష్ప, వెంకటలక్ష్మి, పోలీసు అధికారులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను మంత్రి ప్రదానం చేశారు.