ఇల్లెందు, జనవరి 6: ప్రజలంతా ఏక మై వచ్చే సాధారణ ఎన్నికల్లో మత తత్వ పార్టీ బీజేపీని తరిమికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణంలో పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రారంభమైనదన్నారు. క్రమంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్న బీజేపీ.. కష్టజీవులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో బీజేపీకి బలం లేకున్నా.. అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూస్తున్నదని, అందులో భాగంగానే ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ప్రజాప్రతినిధుల ఇళ్లపై అప్రజాస్వామికంగా దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీని గద్దెదించేందుకు పోరాడే పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూనంనేని స్పష్టం చేశారు.