వనస్థలిపురం, జనవరి 1: అపోహలు, మూఢ నమ్మకాలు వదిలి స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు రావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. అవయవదానం వల్ల మరణించినా వేరొకరి ద్వారా జీవించే ఉంటామని తెలిపారు. జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. జీవన్దాన్ కార్యక్రమం ద్వారా 167 అవయవ మార్పిడులతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందని చెప్పారు.
గాంధీ దవాఖానలో అవయవ మార్పిడికి రూ.35 కోట్లతో ప్రత్యేక బ్లాక్ను నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి 10 లక్షల మందికి దేశం మొత్తం మీద దాతలు 0.6 శాతంగా ఉంటే, తెలంగాణలో 5.08 శాతం ఉన్నారని వెల్లడించారు. దేశ సగటు కంటే తెలంగాణ పది రెట్లు ముందున్నదని వివరించారు.
రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. 250 మంది కుటుంబాలతో సహా వచ్చి అవయవదానానికి అంగీకరించటం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జయచంద్రారెడ్డి ట్రస్టు చైర్పర్సన్ దేవిరెడ్డి కమల సుధీర్రెడ్డి, డాక్టర్ స్వర్ణలత, హస్తినాపురం కార్పొరేటర్ సుజాత, రామ్ చల్లా, డాక్టర్ భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.