హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గతించిన 2023లో ‘జీరో ఎఫ్ఐఆర్’లు భారీగా పెరిగాయి. 2021లో 838, 2022లో 938 ఎఫ్ఐఆర్లు నమోదుకాగా.. 2023లో వాటి సంఖ్య 1,108కు పెరిగింది. మొత్తం ఎఫ్ఐఆర్లలో జీరో ఎఫ్ఐఆర్లు 2022లో 12%, 2023లో 18.12% నమోదయ్యాయి. ప్రజల్లో జీరో ఎఫ్ఐఆర్లపై ప్రభుత్వం, పోలీసుశాఖ విస్తృతంగా అవగాహన కల్పించడంతో అన్యాయం జరిగిన వెంటనే బాధితులు సమీపంలోని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.
గతంలో బాధితులెవరైనా అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం సమీప పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ‘మీ ప్రాంతం మా పరిధి కాదు. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయండి’ అనే సమాధానం వినిపించేది. బాధితులు తమ నివాసం ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, ఫిర్యాదు చేసేలోపు ఎన్నో అనర్థాలు జరిగేవి. ఈ సమస్యను అధిగమించేందుకు, ప్రజలకు మెరుగైన రక్షణ, భద్రత, జవాబుదారీతనం కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం పోలీస్స్టేషన్లకు ఉన్న ‘పరిధి’ అనే అంశాన్ని పూర్తిగా చెరిపేసింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో, తీవ్రమైన కేసులను నమోదు చేసి తక్షణం విచారణ చేపట్టేందుకు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నది.