హైదరాబాద్/వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 9 (నమస్తే తెలంగాణ): హైకోర్టును సందర్శించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(లా అండ్ జస్టిస్)కి న్యాయవాదుల నుంచి నిరసన సెగ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ దేశంలోని హైకోర్టులను సందర్శిస్తున్నది. అందులో భాగంగా మంగళవారం తెలంగాణ హైకోర్టును సందర్శించిన కమిటీకి హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు స్వాగతం పలికారు. హైకోర్టులో మౌలిక వసతులు, ఆన్లైన్ కేసుల విచారణ వంటి అంశాలపై ఏర్పాటైన కమిటీ సభ్యులు ప్రసంగిస్తుండగా పలువురు న్యాయవాదులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నారని, వెంటనే దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత హైకోర్టులో అన్ని వసతులు ఉన్నాయని, పార్కింగ్ సమస్యను పరిష్కరిస్తే సరిపోతుందని తెలిపారు. నిరసనలు, నినాదాలతో అర్ధంతరంగా సమావేశాన్ని ముగించిన కమిటీ సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశం తర్వాత వచ్చి కలుస్తామని చెప్పి వెళ్లిపోయారు. అధికారంలోకి వస్తే కొత్త భవనాలు నిర్మించబోమని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి హైకోర్టు తరలింపునకు ఆమోదం ఎలా తెలుపుతారని సీనియర్ న్యాయవాది గుండ్రాతి శారదాగౌడ్ ప్రశ్నించారు. న్యాయవాదుల అభిప్రాయాలు తెలుసుకోకుండానే హైకోర్టు తరలింపు నిర్ణయం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కమిటీ సభ్యుడైన కేఆర్ సురేశ్రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకుని సీజేతో మాట్లాడతామని నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులకు సర్దిచెప్పి వెళ్లిపోయారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ఈ కమిటీకి సుశీల్కుమార్ మోదీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు వందనా చవాన్, కనకమేడల రవీంద్రకుమార్, కేఆర్ సురేశ్రెడ్డి, దర్శన్సింగ్, వివేక్ కే టంఖా, పీ విల్సన్, లోక్సభ్యులు వీణాదేవి, జస్బీర్సింగ్గిల్, రఘురామకృష్ణంరాజు, మలూక్నగర్, సురేశ్కుమార్, ఓంప్రకాశ్ భూపాల్సింగ్, సంధ్యారే, కులదీప్రాయ్శర్మ, రాజన్, బాబూరావు విచారే సభ్యులుగా ఉన్నారు.
హైకోర్టు నిర్మాణం కోసం యూనివర్సిటీ భూములు ఇవ్వొద్దంటూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మంగళవారం తరగతులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. యూజీ, పీజీ, పీహెచ్డీ చదువుతున్న దాదాపు 200మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. వర్సిటీ పరిధిలో హైకోర్టు నిర్మాణం వల్ల పర్యావరణానికి నష్టం జరగడంతోపాటు వ్యవసాయ పరిశోధనకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి యూనివర్సిటీ విలువ తెలియకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. జీవో 55ను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. విద్యార్ధి సంఘాల నాయకులు రాజ్కుమార్, శ్రీజ,అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు వర్సిటీ ప్రధాన కార్యాలయం గేటు వద్ద మధ్యాహ్నం వరకు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ 100 ఎకరాలు కావాలా? మా ప్రాణాలు కావాలా? అంటూ నినాదాలు చేశారు.